ఘనంగా భద్రకాళి శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం
భద్రకాళీ దేవాలయంలో శాకాంబరీ ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం మొదటి రోజు అమ్మవారు ఉదయం కాళీ క్రమంలో, సాయంత్రం కామేశ్వరీ అలంకారంలో దర్శనమిచ్చారు. వేడుకలకు భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
- ఘనంగా శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం
- తొలి రోజు కాళీ క్రమంలో అమ్మవారు
వరంగల్ వాయిస్, కల్చరల్ : నగరంలోని సుప్రసిద్ధ భద్రకాళి దేవాలయంలో గురువారం వైభవంగా శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 4.30 గంటలకు శ్రీ భద్రకాళీ అమ్మవారికి నిత్యాహ్నికం, ఉత్సవానుజా ప్రార్థన నిర్వహించారు. 6.30 గంటలకు గౌరీ గణపతిపూజ, పుణ్యాహవాచనం, మాతృకాపూజ తదితరాలు నిర్వహించి అమ్మవారిని కాళీ క్రమంలో అలంకరించారు. ఉదయం 10 గంటలకు అమ్మవారికి సహస్ర కలశాభిషేకం, మధ్యాహ్నం ఒంటి గంటకు నీరాజన మంత్రపుష్పములు, తీర్థ ప్రసాద వితరణ, సాయంత్రం ఏడు గంటలకు కామేశ్వరీ నిత్యాక్రమం, సాయంతనపూజ, రాత్రి 8.30గంటలకు నీరాజన మంత్ర పుష్పములు, తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి కె.శేషుభారతి విలేకరుల సమావేశం నిర్వహించి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలన్నారు. 15 రోజుల పాటు వివిధ అలంకరణలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ భద్రకాశి శేషు, ఇతర అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవాల ప్రతులను ఆవిష్కరించారు.




