- కష్టంతో కాదు.. ఇష్టపడి చదవాలి
- సమయ పాలన, పక్కా ప్రణాళిక అవసరం
- అలుపెరుగని శ్రమతో విజయం సాధ్యం
- గ్రూప్ -1 సాధిస్తే జీవితమే మారిపోతుంది
- రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి
- ఖమ్మంలో ఉద్యోగార్థులకు ప్రేరణ తరగతులు
‘‘ప్రతీ ఒక్కరిలో తనకు తెలియని శక్తి సామర్థ్యాలు ఎన్నో ఉంటాయి.. వాటిని బయటకు తీసి సరైన సమయంలో వినియోగించుకున్నప్పుడే మనిషి జీవితానికి సార్థకత.. నిరాశ, నిస్పృహలు వద్దు.. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా చదివితే ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కష్టం కాదు..’’ అని ఉద్యోగార్థులకు విశ్రాంత ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి సూచించారు. మంగళవారం ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో గ్రూప్స్ పోటీపరీక్షలకు ప్రభుత్వ శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ఆయన సూచనలు, సలహాలు అందించారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించేలా వారిలో ప్రేరణ కలిగించారు. కష్టపడి కాదు.. ఇష్టపడి చదవాలని.. కొలువు సాధించేదాక విశ్రమించొద్దని పిలుపునిచ్చారు.
వరంగల్ వాయిస్, ఖమ్మం: కష్టంతో కాదు.. ఇష్టంతో ప్రణాళికాబద్ధంగా చదివితే గ్రూప్ ఉద్యోగాలు సాధించటం సులభమేనని విశ్రాంత సీనియర్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి తెలిపారు. మంగళవారం స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గ్రూప్ ఉద్యోగాలకు శిక్షణ పొందుతున్న అభ్యర్థులను ఉద్దేశించి ఏర్పాటుచేసిన ప్రేరణ తరగతులకు ముఖ్య అథితిగా ఆయన హాజరై మాట్లాడారు.. రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్స్ ఉద్యోగాలతో పాటు, పోలీస్, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలను పెద్దఎత్తున భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేసిందన్నారు. రాష్ట్రం ఏర్పాటైన ఎనమిది సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాల జాతర ప్రారంభమైందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని యువత ఎలాగైనా ఉద్యోగాలు సాధించాలన్న పట్టుదలతో చదవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనార్టీ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఏర్పాటు చేసి వారు కొలువులు సంపాదించేలా ఆయా శాఖల ద్వారా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. నిష్ణాతులైన అధ్యాపకులు, నిపుణుల ద్వారా ఉద్యోగార్థులకు శిక్షణ ఇస్తున్నారని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తాను స్వయంగా ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో తెలుగు మీడియంలోనే చదివి ఉద్యోగం సాధించి ఐఏఎస్ స్థాయికి చేరుకున్న స్వీయ అనుభవాన్ని అభ్యర్థులకు తెలియజేశారు. ఉద్యోగంతో సమాజంలో గౌరవప్రదమైన స్థానం, గుర్తింపు వస్తుందన్నారు. బంగారు తెలంగాణ సాధనకు యువత ముఖ్యమని, రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందన్నారు. యువత పరిపాలనా రంగంలోకి రావాలంటే గ్రూప్స్ వంటి ఉన్నతోద్యోగాలు పొందాలని, తద్వారా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఉద్యోగం సాధించేందుకు చదువు ఒక్కటే సరిపోదని, పట్టుదల, కృషి, ప్రణాళిక కావాలని, ముఖ్యంగా ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే దృఢ సంకల్పం ఉండాలన్నారు. ఇందుకు అభ్యర్థులు ‘‘రీడిరగ్, రికార్డ్, రివిజన్ ‘‘పద్ధతి అనుసరించాలని, 360 డిగ్రీల కోణంలో ప్రణాళికాబద్ధంగా చదవాలన్నారు. కలలు కనడంతో పాటు వాటిని సాకారం చేసుకోనెలా కృషి చేయాలన్నారు. సమయ పాలన పాటిస్తూ సిలబస్ కు అనుగుణంగా సన్నద్ధం కావాలని సూచించారు. పాత ప్రశ్న పత్రాలను విశ్లేషించుకోవాలని, పరీక్షలో ప్రతీ ప్రశ్న, ప్రతీ మార్కు కీలకమేనని, ఏకాగ్రతతో, స్థిరత్వంతో, విషయ పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటూ సిద్ధం కావాలన్నారు.
కార్యక్రమంలో కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ.. ఇది ఒక మారథాన్ ప్రయాణమని, ఒడిదుడుకులు వుంటాయని, సమర్థవంతంగా నడుచుకోవాలని అభ్యర్థులకు సూచించారు. లక్ష్యం పై గురిపెట్టి, సాధనకు కృషి చేయాలని అన్నారు. గ్రూప్ వన్ పరీక్షల సన్నద్ధం అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుందని అన్నారు. జిల్లా యువతకు స్ఫూర్తి నిచ్చేందుకు వచ్చిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథిని కలెక్టర్ గౌతమ్ మునిసిపల్ కమిషనర్ శాలువాలతో ఘనంగా సత్కరించారు. అంతకుముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు మొగిలి స్నేహాలత, ఎన్. మధుసూదన్, ఖమ్మం మునిసిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి స్వాగతం పలికి మొక్కలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి సత్యనారాయణ, జిల్లా బీసీ సంక్షేమ అధికారి జ్యోతి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మహమూది, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కృష్ణా నాయక్, బీసీ స్టడీ సర్కిల్ ప్రత్యేక అధికారి శ్రీలత తదితరులు పాల్గొన్నారు.












