- కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వడం ఖాయం
- డబుల్ ఇంజిన్కు ఈ సారి ట్రబుల్ తప్పదంటున్న సర్వేలు
వరంగల్ వాయిస్,బెంగళూరు: కర్నాటకలో త్వరలో జరగబోయే ఎన్నికలు బిజెపికి అంత సులువు కాదని స్థానిక పరిస్థితులు తెలియ చేస్తున్నాయి. బిజెపి నేతలు అవినీతితో కూరుకు పోవడం ఇప్పుడు అక్కడ చర్చగా మారింది. మిగతా రాష్టాల్రతో పోలిస్తే కర్నాకటలో డబుల్ ఇంజిన్ సర్కార్తో లాభం లేదన్న విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. 2008 ఎన్నికల్లోనూ, 2019లోనూ కూడా బీజేపీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి రాలేదు. ఆపరేషన్ ఆకర్శక్తో గట్టెక్కి అంటే బలవంతంగానే అధికారాన్ని లాక్కున్నారని చెప్పక తప్పదు. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. కాంగ్రెస్కు అనుకూలంగా పరిస్థితులు మారుతున్నాయి.
ఈ క్రమంలో మే 10న జరగబోతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు బిజెపికి పెద్ద పరీక్ష. దక్షిణ భారతంలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్నాటక మాత్రమే. నిజానికి కర్నాటకలో పాలన మంచిగా సాగివుంటే బిజెపికి వ్యతిరేకంగా పరిస్థితి ఉండేది కాదు. అయినా మెజారిటీ సాధిస్తామని బీజేపీ నాయకులు
మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తున్నారు. వరుస పరాజయాలు చవిచూస్తున్న కాంగ్రెస్కు కర్ణాటక ఎన్నికలు జీవన్మరణ సమస్య. రాజకీయంగా నిలబడాలన్నా, విపక్ష పెద్దగా ఉండాలన్నా, సార్వత్రక ఎన్నికలకు కదనోత్సాహంతో కదలాలన్నా ఈ పరీక్షలో నెగ్గాల్సిందే. ఎన్నికలు ఏ స్థాయివైనా నిత్యసంసిద్ధతతో నిలబడే బీజేపీతో కలబడేందుకు సార్వత్రక ఎన్నికలవరకూ ఎందుకు, రాబోయే మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్ ఎన్నికలకు కూడా కర్ణాటక కొత్తశక్తినిస్తుంది. కర్ణాటకలో కాంగ్రెస్ బలహీనంగా ఏవిూ లేదు. వ్యవస్థాగత పునాది, బలమైన స్థానిక నాయకత్వం ఉంది. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న సిద్దరామయ్య, శివకుమార్ మధ్య ఆధిపత్య పోరాటం ఉన్నా ఇద్దరూ బలమైనవారే. మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో కూచోవడం కర్ణాటకలోని దళితులను ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు. బీజేపీ పాలన అత్యంత అవినీతిమయమైనదిగా ప్రచారం చేస్తూ, ఉచిత విద్యుత్, ప్రతీ గృహిణికీ రెండువేల రూపాయల ఆర్థికసాయం, నిరుద్యోగ భృతి ఇత్యాది ఆకర్షణీయమైన హావిూలు గుప్పిస్తూ కాంగ్రెస్ యుద్ధం చేస్తోంది. గత ఎన్నికలతో పోల్చితే కాంగ్రెస్ ఓటు రెండుశాతం హెచ్చిందని సర్వేలు చెబుతున్నాయి. రాహుల్ సభ్యత్వం రద్దు నేపథ్యంలో మరింత సానుకూలతను సాధించగలిగితే కాంగ్రెస్ గట్టెక్కగలదని అంటున్నారు. క్షేత్రస్థాయిలో జోడోయాత్ర ప్రభావం కూడా ఉంది. రాహుల్ ఎదుర్కొంటున్న వేధింపుల విషయంలో ప్రజల మనోభిప్రాయం ఏమిటో కర్ణాటక ఫలితాలు తెలియచెప్పవచ్చు. గతంలో యెడ్యూరప్పపై సానుభూతితో అతిపెద్ద పార్టీగా అవతరించింది. సర్వేలు మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని అంటున్నాయి. కాంగ్రెస్ విజయం ఖాయమని కొన్ని తేల్చేస్తే, బీజేపీ కాంగ్రెస్ హోరాహోరీ వాస్తవమని మరికొన్ని స్పష్టం చేస్తున్నాయి. పోటీ తీవ్రత బీజేపీ పెద్దలకు తెలియకపోదు. ఎన్నికల ప్రకటనకు ఎంతోముందుగానే ఆరంభమైన కేంద్రపెద్దల పర్యటనలు, మోదీ ఏడుపర్యాయాల పర్యటనలు, శంకుస్థాపనలు, హడావుడి ఆరంభాలు అటుంచితే, మొన్న శుక్రవారమే బొమ్మయ్ ప్రభుత్వం అత్యంత దూకుడు నిర్ణయం ఒకటి చేసింది. నాలుగు దశాబ్దాలుగా ఉన్న నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దుచేసి, బలమైన లింగాయత్, వొక్కళిగ కులాలకు చెరో రెండుశాతం పంచింది. అధికార పక్షంవిూద ప్రజావ్యతిరేకత అత్యధికంగా ఉన్నదని సర్వేలు చెబుతున్న స్థితిలో ఈ చర్యలు, హావిూలు పార్టీని గ్టటెక్కిస్తాయో లేదో చూడాలి.
