- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తక్కళ్లపల్లి
వరంగల్ వాయిస్, హనుమకొండ : కమ్యూనిస్టుల మార్గదర్శకులు నల్లమల గిరి ప్రసాద్ ఆశయాలను కొనసాగిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు అన్నారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో గిరి ప్రసాద్ 27వ వర్ధంతిని సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గిరి ప్రసాద్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం తక్కళ్లపల్లి శ్రీనివాస రావు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో దళ నాయకులుగా పనిచేసిన గిరి ప్రసాద్ గిరిజనులను సమీకరించి జమీందార్లు, రజాకార్లు, రజాకార్ల స్వాధీనంలో ఉన్న వేలాది ఎకరాల భూమిని పేదలకు పంచారన్నారు. అనేక కేసులను, నిర్భందాలను ఎదుర్కొని జైలు జీవితం అనుభవించిన గిరి ప్రసాద్ భారత కమ్యూనిస్టు పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారని తెలిపారు. నిరంతరం ప్రజా సమస్యలపై, పాలకుల విధానాలపై పోరాటాలు నిర్వహించి కమ్యూనిస్టుల మార్గదర్శకులుగా నిలిచారన్నారు. గిరి ప్రసాద్ ఆశయాలను నేటి తరం ముందుకు తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, మాజీ జిల్లా కార్యదర్శి సిరబోయిన కర్ణాకర్, జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్, నాయకులు మునిగాల భిక్షపతి, వేల్పుల సారంగపాణి, నేదునూరి రాజమౌళి, మాలోతు శంకర్, ఏశబోయిన శ్రీనివాస్, కండె నర్సయ్య, పూర్ణ చందర్, ఎర్ర నాగరాజు, శివ తదితరులు పాల్గొన్నారు.
