హత్య కేసును ఛేదించిన పోలీసులు
మర్డర్ కేసులో నిందితుడు అరెస్ట్
వరంగల్ వాయిస్, రేగొండ : వ్యాపారం దివాలా తీయడానికి కారణం కన్నకొడుకేనని, చెప్పిన మాట వినడం లేదని కన్న తండ్రి కసాయిగా మారి కొడుకును హతమార్చిన ఘటనను పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో చిట్యాల సీఐ దగ్గు మల్లేష్ యాదవ్, ఎస్సై ఎన్ రవికుమార్ లు విలేకరుల సమావేశం నిర్వహించి హత్య వివరాలను వెల్లడించారు. రేగొండ మండలం నారాయణపురం గ్రామానికి చెందిన పెరుగు లింగమూర్తి కుమారుడు సాయి గణేష్ గత ఏడాది నవంబర్ నెలలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు అప్పటి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం వివరాలలో అనుమానం రావడంతో విచారణ చేపట్టగా హత్య విషయం వెల్లడైనట్లు సీఐ మల్లేష్ యాదవ్ తెలిపారు. విచారణ చేపట్టగా మృతుడి తండ్రి చేసినట్లు నిర్ధారణ కావడంతో నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే నారాయణపురం గ్రామానికి చెందిన పెరుగు లింగమూర్తి రేగొండ, పరకాల, టేకుమట్ల మండల కేంద్రాలలో సూపర్ మార్కెట్ వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాడు. లింగమూర్తికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కాగా చిన్న కుమారుడు సాయి గణేష్ (23) చదువులో రాణించకపోవడంతో పరకాలలోని సూపర్ మార్కెట్ అప్పగించాడు. సూపర్ మార్కెట్ వ్యాపారం దివాలా తీయడానికి కారణం కొడుకేనని భావించిన లింగమూర్తి చెప్పిన మాట వినడం లేదని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పథకం ప్రకారం రాత్రి సమయంలో సాయి గణేష్ ను హతమార్చాడని చిట్యాల సీఐ తెలిపారు. ఈ ఘటనలో లింగమూర్తిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు సీఐ పేర్కొన్నారు.
