నవనీతకృష్ణాలంకారంలో రామయ్య ముగ్ధమనోహర రూపం వరంగల్ వాయిస్,ఒంటిమిట్ట: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సోమవారం ఉదయం నవనీతకృష్ణాలంకారంలో రాములవారు ముగ్ధమనోహరంగా దర్శనమిచ్చారు. ఉదయం 8 గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. కేరళ డ్రమ్స్, భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. పురాణాల ప్రకారం.. కృష్ణుడు వెన్నదొంగ. రేప్లలెలో బాలకృష్ణుడు యశోదమ్మ ఇంట్లోనే గాక అందరి ఇళ్లలోకి వెళ్లి వెన్న ఆరగించేవారు. ఈ చిన్నికృష్ణుడి లీలలను గుర్తు చేస్తూ రాములవారు వెన్నకుండతో భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ నటేష్ బాబు, మాన్యుస్క్రిప్ట్ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి విజయలక్ష్మి, ఏఈఓ గోపాలరావు, సూపరింటెండెంట్లు పి.వెంకటేశయ్య, ఆర్సీ సుబ్రహ్మణ్యం, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజయ పాల్గొన్నారు.