కార్యక్రమాన్ని రద్దు చేసుకుని నరేందర్ మృతికి కవిత నివాళి వరంగల్ వాయిస్,జగిత్యాల: జగిత్యాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. ర్యాలీ తీస్తుండగా బీఆర్ఎస్ కౌన్సిలర్ బండారి రజినీ భర్త నరేందర్ గుండెపోటుతో మృతి చెందారు.జగిత్యాల జిల్లా కేంద్రంలో పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా కవితకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నాయకులు డీజేలతో డ్యాన్స్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. డీజే ముందు డ్యాన్స్ చేస్తున్న బండారి నరేందర్ ఒక్క సారిగా కుప్పకూలారు. వెంటనే అక్కడున్న కార్యకర్తలు సీపీఆర్ చేసి.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నరేందర్ మృతి చెందారు. దీంతో పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. నరేందర్ మృతితో జగిత్యాలలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని రద్దు చేశారు. నరేందర్ మృతిపట్ల సంతాపం తెలిపిన కవిత.. ఆస్పత్రికి వెళ్లి నరేందర్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. నరేందర్ మృతి చెందారన్న వార్త తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత తన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. పార్టీ కార్యక్రమం వేదిక వద్ద నరేందర్ భౌతికకాయానికి ఎమ్మెల్సీ కవిత నివాళులర్పించారు. ఆయ. చిత్రపటానికి ఆమె పుష్పాంజలి ఘటించారు. నరేందర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.