- ఎమ్మెల్సీ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ సత్యాపాల్ రెడ్డి
వరంగల్ వాయిస్, ములుగు : ఈ నెల 27న జరగనున్న వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ను సమర్థవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్సీ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ సత్యాపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఎమ్మెల్సీ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ సత్యాపాల్ రెడ్డి వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నిర్వహణ, పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ విధానంపై పీఓలు, ఏపీఓలకు, ఓపీఓలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలు పీవోలు , ఏపీవోలు, ఓపీఓల పాత్ర కీలకంగా ఉంటుందని ఎన్నికల సంఘం విధివిధానాలపై అందరికీ అవగాహన ఉండాలని తెలిపారు. పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని, ఓటర్లు బ్యాలెట్ బాక్స్ లలో బ్యాలెట్ పేపర్ తో ఓటు వేస్తున్నందున నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల నియమ నిబంధనలను పాటించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ శ్రీనివాస్ కుమార్, ములుగు తహసీల్దార్ విజయ భాస్కర్, సూపర్ ఇండెంట్ శివకుమార్, ఎలక్షన్ డీటీలు విజయ్, అనిస్ ఫాతిమా, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
