- బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రాములు
వరంగల్ వాయిస్, వరంగల్ : నల్గొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్రఅధ్యక్షులు తాటిపాముల వెంకట్రాములు పట్టబద్రులైన ఓటర్లకు పిలుపునిచ్చారు. బీసీ హక్కుల సాధన సమితి ఈ ఎన్నికలలో తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్ )కు సంపూర్ణ మద్దతును ప్రకటించిందన్నారు. గత పదేళ్లుగా పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరుగని పోరుసలిపి ప్రజా సమస్యలపై ముఖ్యంగా బీసీల, బడుగు, బలహీన వర్గాల, విద్యార్థి, యువజన, మహిళల, మైనారిటీల, అన్నివర్గాల ప్రజల సమస్యలపై పోరాడే, ప్రశ్నించే ప్రజా గొంతుకగా నిలుస్తున్న తీన్మార్ మల్లన్న శాసనమండలిలో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సమాజంలో వివిధ వర్గాలకు జరుగుతున్నఅన్యాయాలపై, అక్రమాలపై శాసనమండలిలో గొంతెత్తి ప్రజావాణిని నిర్భయంగా వినిపించగలిగే మల్లన్నను గెలిపించేందుకు బీసీ, ఉద్యోగ, కార్మిక విద్యార్థి, యువజన, మహిళ, మైనార్టీ ఇతర ప్రజా సంఘాల కార్యకర్తలు ఆయా జిల్లాలలో అంకితభావంతో కృషి చేస్తున్నారన్నారు. ఉన్నత విద్యావంతులైన ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఈనెల 27న తమఅమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటును తీన్మార్ మల్లన్నకు వేసి గెలిపించాలని వెంకట్రాములు విజ్ఞప్తి చేశారు.
