- కష్టపడితే కొలువుమీదే
- ట్రిపుల్ ఆర్ ఫాలో కావాలి
- రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పార్థసారథి
ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగాల యుగం నడుస్తోందని, కష్టపడితే కొలువు కష్టం కాదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సి.పార్థసారథి ఉద్యోగార్థులకు పిలుపినిచ్చారు. గురువారం గ్రూప్ 1 ఉద్యోగార్థుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.. రీడ్, రిమెంబర్, రివైజ్డ్ (ట్రిపుల్ ఆర్) సూత్రాలను గుర్తుంచుకోవాలన్నారు. సిలబస్ పై స్పష్టత పెంచుకొని ప్రిపరేషన్ కొనసాగించాలన్నారు. కష్టపడినోళ్లకే కొలువు దక్కుతుందన్నారు. ఉద్యోగార్థి సోషల్ మీడియాకు దూరంగా ఉండి కోరుకున్న కొలువుకు దగ్గర కావాలన్నారు. ప్రస్తుతం కొలువులు ఎక్కువ ఉండడంతో పోటీ నిష్పత్తి తక్కువ ఉంటుందని, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
డిచ్పల్లి (నిజామాబాద్) : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పోటీ పరీక్షల శిక్షణా విభాగం ఆధ్వర్యంలో న్యాయ కళాశాలలోని సమావేశ మందిరంలో గురువారం ఉదయం గ్రూప్ – 1 తదితర ప్రభుత్వ ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్, రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి సి.పార్థసారథి ప్రధాన వక్తగా విచ్చేసి ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన పోటీ పరీక్షలకు నమోదు చేసుకున్న విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న ఉద్యోగాలు నభూతో నభవిష్యత్ అన్నారు. ఇది ఉద్యోగాల యుగమని అభివర్ణించారు. వ్యవసాయ యుగం, పారిశ్రామిక యుగం, సాంకేతిక యుగం ఇలా ఈనాడు ఇన్ఫర్మేషన్ యుగం నడుస్తోందన్నారు. మానవుని సమగ్రాభివృద్ధి అంతా కండబలం, బుద్ధిబలం మీద నిర్మాణమవుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయన తన జీవన నేపథ్యాన్ని వివరించారు. బాల్యం, విద్యాభ్యాసం, ఉద్యోగం వంటి ప్రధాన జీవన ఘట్టాలను తెలియజేసారు. తాను ఎలా చదువుకున్నారో, ఎలా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారో వివరించారు. అదే విధంగా కొన్ని సందర్భాల్లో అపజయం పొందిన అంశాలను కూడా తెలిపారు. అలాంటివి జీవితంలో ఎదురవుతూనే ఉంటాయని, వాటిని తలుచుకొని భయపడకుండా ముందడుగు వేస్తూ వెళ్లగలిగానన్నారు. ఇలాంటి స్ఫూర్తితో అభ్యర్థులు తమ లక్ష్య సాధనకోసం ప్రయత్నం చేయాలన్నారు.
పోటీ 1:25 మాత్రమే..
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల అభ్యర్థుల నిష్పత్తి 1:25 మాత్రమే ఉందని సి.పార్థసారథి ప్రకటించారు. ఈ సమయంలో ఉద్యోగం సాధించడం చాలా సులువైన విషయమన్నారు. మనమెన్నో ఆటుపోట్లను, ప్రకృతి వైపరీత్యాలను, ఆకస్మికంగా పుట్టుకొచ్చే అనేక వైరస్ లను తట్టుకొని ఎదురీదు తున్నమన్నారు. వాటి ముందు చూస్తే ఈ ఉద్యోగాలు సాధించడం అంత కష్టమైన పని కాదన్నారు. అందుకు మొదట పోటీ పరీక్షల కోసం సబ్జెక్ట్ కంటే సిలబస్ పై ఎక్కువ అవగాహన కలిగి ఉండాలన్నారు. నిర్దేశించిన పాఠ్యప్రణాళిక మీద పూర్తి సాధికారత పొందాలన్నారు. మానవ జీవన పరిణామ క్రమంలో జరిగిన మార్పు ఇదే అన్నారు. ఎవరైనా ప్రేరణ, స్ఫూర్తి, ఉత్సాహం, ప్రోత్సాహం మాత్రమే కలిగించుతారన్నారు . పాఠశాల, కళాశాలలోనే ఒక లక్ష్యం, గమ్యంతో చదువు కొనసాగించాలన్నారు. అన్నిటి కంటే ఆత్మ స్థైర్యం, విశ్వాసం గొప్పదన్నారు. గానీ గర్వం పనికి రాదన్నారు. దానికి ఉదాహరణగా తాబేలు -కుందేలు కథ చెప్పారు. దానిని పూర్తిగా విశ్వసిస్తే ఏదైనా సాధించవచ్చన్నారు. మానవ సాధన్ ఒక గాలి పటం లాంటి దన్నారు. ఒక కక్ష్యలోకి వెళ్ళిన తర్వాత దాని పతనానికి అవకాశం ఉండదన్నారు. ఉద్యోగ సాధన కూడా అలాంటిదే అన్నారు. ఒకసారి మనం ఒక ఉద్యోగంలో అడుగు పెడితే చాలు అనేక మెట్లను అధిగమించ గలుగుతామన్నారు. తాను అసిస్టెంట్ కంజర్వేషన్ పోస్ట్, సివిల్స్ పరీక్ష రాసి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పోస్ట్, గ్రూప్ 1 ఆఫీసర్స్ డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ వంటివి సాధించి నేడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా, కమిషనర్ గా నిలబడ్డానన్నారు. ప్రభుత్వ ఉద్యోగం ద్వారానే ప్రజలకు సేవ చేసే భాగ్యం కలుగుతుందన్నారు. లక్ష ఉద్యోగాల్లో యువతరం స్థిరపడతున్న నేపథ్యంలో ఒక ట్రెండ్ ఏర్పడుతుందన్నారు. యువత ఆలోచనా విధానం, సృజనాత్మక శక్తి, సామాజిక నిబద్ధత, సమాజాన్ని కొత్త కోణంలో వృద్ధి పరచాలని సంకల్పం అనేవి ఈ ఉద్యోగాల భర్తీలో ప్రతిఫలించే అంశాలని అన్నారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, రాజనీతి, సాహిత్యం, ఫిలాసఫీ, జాగ్రఫీ వంటివి మన పోటీ పరీక్షల్లో ఏ విధంగా ప్రశ్నలుగా అడుగుతారో తెలియజేశారు.
ట్రిపుల్ ఆర్ ఫాలో కావాలి..
డైరెక్ట్ ప్రశ్నలుగా గాకా ఆయా విషయానికి సంబందించిన పుర్వాపర అంశాలతో ప్రశ్నలను సందిస్తారన్నారు. అలాంటి అందర్భంలో ఒక అంశంపై క్షుణ్ణంగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉందన్నారు. ఉదాహరణకు రామప్పగుడి – యునెస్కో గుర్తింపులో చుట్టూ ఉన్న అనేక అంశాలపై అవగాహన ప్రాక్టీస్ అవరసమన్నారు. ఇలాంటి వాటికి ఆర్ ఆర్ ఆర్ పద్ధతిని అనుసరించాని చమత్కరించారు. రీడిరగ్, రిమెంబర్, రివిజన్ సూత్రాన్ని అనుసరించాలన్నారు. తక్కువ పుస్తకాలు చదివినా గానీ ఎక్కువ మననం చేసుకోవాలన్నారు. ఒత్తిడులను సృష్టించుకోవద్దన్నారు. క్రమబద్ధమైన ప్రణాళికతో చదువుకోవాలన్నారు. గుడ్డెద్దు చెనులో పడట్టుగా కాకుండా సమయాన్ని సబ్జెక్ట్ లకు అన్వయించుకోవాలన్నారు. మొత్తంగా విహంగ వీక్షణ చేసుకొనే దృష్టి ఏర్పడాలని అన్నారు. అందుకు అద్భుత శక్తిని సాధించాలన్నారు. నిరాశ, నిస్పృహలను దరిచేరనివ్వకుండా, తాము ఎలాగైనా సాధిస్తానని గట్టి సంకల్పంతో కష్టపడితే ఆశించిన లక్ష్యం దానంతట అదే వరిస్తుందని సూచించారు. మొహమాటం, బద్ధకం, వాయిదా వేయడం వంటి దురలవాట్లకు దూరంగా ఉంటూ, మానసిక ఒత్తిడిని జయిస్తూ ముందుకు సాగాలని హితవు పలికారు.న్ని గంటల పాటు చదివామని కాకుండా, ఎంత ఏకాగ్రతతో చదివాం. చదివిన అంశాలను పరీక్షలో ఎలా రాశాం. అన్నదే అభ్యర్థుల విజయావకాశాలను నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిలో శక్తి సామర్థ్యాలు నెలకొని ఉంటాయని, తమపై తాము గట్టి నమ్మకంతో కష్టపడే వారే విజేతలు అవుతారని అన్నారు. నేర్చుకుంటున్న అంశాలను ఎప్పటికప్పుడు పునఃశ్చరణ చేసుకుంటూ, ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిచేసుకోవాలని సూచించారు. పోటీ పరీక్షలు సన్నద్ధత వ డే మ్యాచ్ కాదని, దీనిని టెస్ట్ మ్యాచ్ గా భావిస్తూ, నిలకడ ఏకాగ్రతతో లక్ష్యాన్ని ఛేదించాలని పేర్కొన్నారు. మన చేతుల్లో లేని విషయాల గురించి ఆలోచిస్తూ సమయం వృథా చేయడం కంటే, మనం చేయాల్సిన కర్తవ్యాన్ని పూర్తి స్థాయిలో నిర్వర్తించడం పైనే దృష్టిని కేంద్రీకరించాలని హితబోధ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎంతో కీలకమైందని పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో యువత కోరుకున్న కొలుపులు దక్కించుకుని బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయడంతో అనవసర అపోహలకు ఆస్కారం లేకుండా పోయిందన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య డి.రవీందర్, ఆత్మీయ అతిథిగా ఆచార్య కె.శివశంకర్, ఆర్ డీఓ రవికుమార్, ప్రధానాచార్యులు ఆచార్య సీహెచ్.ఆరతి, డైరెక్టర్ డాక్టర్ జి.బాలశ్రీనివాస మూర్తి, డాక్టర్ రవీందర్ రెడ్డి, డాక్టర్ వి.త్రివేణి, డాక్టర్ మహేందర్ రెడ్డి, డాక్టర్ ప్రసన్న రాణి, డాక్టర్ బి.స్రవంతి తదితర అధ్యాపకులు, అధ్యాపకేతరులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, మీడియా మిత్రులు, సిబ్బంది, అధిక సంఖ్యలో విద్యార్థి అభ్యర్థులు పాల్గొన్నారు.


























