సంప్రదాయ పంచెకట్టులో హాజరైన జగన్ వరంగల్ వాయిస్,అమరావతి: శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకొని తెలుగు రాష్టాల్ల్రో ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఉగాది పచ్చడి సేవించి తెలుగు వారి నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. ప్రధాన ఆలయాల్లో పండితులు పంచాంగ శ్రవణాలు వినిపించారు.రాష్ట్రవ్యాప్తంగా నేతలు ప్రజలు ఈ పండుగను వైభవంగా నిర్వహించారు. ఏపీ సీఎం జగన్ ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా తెలుగు సంప్రదాయాలు సంస్కృతి ఉట్టిపడేలా సాగాయి. తాడేపల్లి లోని ఏపీ సీఎం జగన్ నివాసంలోని గోశాలలో ఉగాది వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతిలు సంప్రదాయ దుస్తుల్లో వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకలకు ముందు శ్రీ వేంకటేశ్వర ఆలయంలో సీఎం జగన్ దంపతులు పూజలు నిర్వహించి ఉగాది పచ్చడిని స్వీకరించారు. సంప్రదాయ దుస్తుల్లో జగన్ భారతి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ సీఎం జగన్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శ్రీశోభకృత్ నామ సంవత్సరం అందరి జీవితాల్లో శుభాలు కలిగించాలని జగన్ ఆకాంక్షించారు. రైతులకు, అక్కచెల్లెమ్మలు సకల వృత్తుల వారికి ఈ శోభకృత్ నామ సంవత్సరంలో మంచి జరగాలని…తద్వారా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని జగన్ తెలిపారు. ఉగాది సందర్భంగా సోమయాజి పంచాంగ పఠనం చేశారు. ఈ సందర్భంగా జగన్ సోమయాజిని సన్మానించారు. తిరుమల ఆలయం విజయవాడ కనకదుర్గ ఆలయం నుంచి వచ్చిన పండితులు సీఎం జగన్ మోహన్ రెడ్డి దంపతులను ఆశీర్వదించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను సీఎం జగన్ దంపతులు వీక్షించారు. ఈ వేడుకల్లో మంత్రి రోజా వైసీపీ నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.