మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్
కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ
వరంగల్ వాయిస్, హనుమకొండ:జమ్మూ కశ్మీర్ పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిలో అమాయక పర్యాటకుల ప్రాణనష్టం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని భారతమాత బిడ్డలైన 28 మంది పర్యాటకులు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరమని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.ఈ దారుణ ఘటనపై ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, హనుమకొండ జిల్లా భారత రాష్ట్ర సమితి యువజన విభాగం ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ కార్యాలయం నుండి సుబేదారి అమరవీరుల స్తూపం వరకు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ హాజరై అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే ఉగ్రవాదుల కుట్ర ఇది. కశ్మీర్లో జరిగినా దాని ప్రకంపనలు అన్ని రాష్ట్రాల్లో గుబురుపుట్టిస్తున్నాయన్నారు.అమాయకులపై ఇలాంటి దాడులు జరగడం అత్యంత బాధాకరమని భారతీయుల ఐక్యతను దెబ్బతీసేందుకు ఉగ్ర మూకలు ప్రయత్నిస్తున్నా, మన ప్రజలు శాంతియుతంగా, ఐక్యంగా ఎదుర్కొనాలన్నారు. భారతీయుల ఆత్మస్థైర్యాన్ని ఎలాంటి దొంగదెబ్బలతోనూ దెబ్బతీయలేరని దేశ భద్రతకు ముప్పుగా మారుతున్న ఇటువంటి ఘటనలపై కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని భారత రాష్ట్ర సమితి తరపున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ నాయకులు, యూత్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
