వరంగల్ వాయిస్, హనుమకొండ:రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీ లలోని 3 సంవత్సరాల ఇంజనీరింగ్,నాన్-ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటుగా, వ్యవసాయ డిప్లొమా, వెటర్నరీ డిప్లొమా
ప్రవేశం కోసం జరిగే పాలీసెట్-2025ను ఈ నెల 13వ తేదీ (మంగళవారం) రోజున ఉ. 11.00 గం.నుండి మ. 1.30 గం. వరకు నిర్వహించనున్నట్లు, ఇందు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వరంగల్ జిల్లా కోఆర్డినేటర్, ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ డా. బైరి ప్రభాకర్ తెలిపారు.ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ డా. బైరి ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,06,000 మంది అభ్యర్థులు హాజరవుతున్న ఈ పరీక్షకు వరంగల్ నగరంలోని 12 కేంద్రాలనుండి 6424 మంది విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు.విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి ఒక గంట ముందుగానే, అనగా ఉదయం 10.00 గంటలకే అనుమతిస్తారని కావున విద్యార్థులు ఉ. 10.00 గంటలకే పరీక్ష హాలులోకి చేరుకొని ఓ ఎం ఆర్ షీట్ లోని రెండు వైపులలోని వివరాలు పూర్తి చేసి సంతకం చేయవలసి ఉంటుందన్నారు.విద్యార్థులు తమ వెంట HB/2B బ్లాక్ పెన్సిల్, ఎరేసర్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్ తప్పకతీసుకొని రావలని అన్నారు.పరీక్ష ప్రారంభమైన ఉ. 11.00 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యం అయినా అభ్యర్థిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించబడరని తెలిపారు.హాల్ టికెట్ మీద ఫోటో లేకపోతే ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో, ఐడి ప్రూఫ్ (ఆధార్ కార్డు) తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.పరీక్ష కేంద్రంలో సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించబడవని తెలిపారు.ఇంజనీరింగ్ డిప్లొమా చేయాలనుకునే వారు గణితం – 60 మార్కులు, భౌతిక శాస్త్రం – 30 మార్కులు, రసాయన శాస్త్రం 30 మార్కులు కోసం పరీక్ష రాయవలసి ఉంటుందన్నారు.వ్యవసాయ,వెటర్నరీ డిప్లొమా చేయాలనుకునే వారు అదనంగా జీవశాస్త్రం – 30 మార్కులు పరీక్ష రాయవలసి ఉంటుందన్నారు. వరంగల్ నగరంలోని ఈ క్రింది 12 కేంద్రాలలో (పట్టిక ఇందు వెంట జతపరచ నైనది) పరీక్ష నిర్వహించబడునని తెలిపారు.