Warangalvoice

Krishna Adithya

అడవి జిల్లాలో అభివృద్ధి సాధకుడు

ములుగు జిల్లా కలెక్టర్‌ గా విశిష్ట సేవలు

krishna adithya title

ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను పరుగులు పెట్టిస్తూ ములుగు జిల్లాను ప్రగతి పథంలో తీసుకెళ్తున్నారు కలెక్టర్‌ శ్రీరాంసెట్టి కృష్ణ ఆదిత్య. విధుల పరంగా లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం.. నిరంతర శ్రమతో వాటిని సాధించడం ఆయనకు తెలిసిన విద్య. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన అభివృద్ధి సాధకుడు. ఆత్మీయ పలకరింపులతోనే సహచర ఉద్యోగుల పనుల్లో వేగం పుంజుకునేట్లు చేయడం ప్రత్యేకత. జిల్లా పాలనాధికారిననే దర్పం ఆయనలో కనిపించదు. జిల్లా ప్రగతికి పక్కా ప్రణాళికలు రూపొందిస్తూనే, అట్టడుగు వర్గాలకు సమన్యాయం చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ‘ములుగు వెలుగు, మారైతే మారాజు, ప్లాస్టిక్‌ నియంత్రణ, అటెండెన్స్‌ యాప్‌’ కార్యక్రమాలను అమలు చేస్తూ జిల్లా
సమగ్రాభివృద్ధికి కలెక్టర్‌ పాటుపడుతున్నారు. అలాగే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం
చేస్తున్నారు కృష్ణ ఆదిత్య.

బాల్యం.. విద్యార్థి దశ..

1985 అక్టోబర్‌ 4న నల్గొండ పట్టణంలో శ్రీరాంసెట్టి సుజాత-శంకర్‌రావు దంపతులకు కృష్ణ ఆదిత్య జన్మించారు. తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ అధ్యాపకులుగా పనిచేసి పదవీ విరమణ పొందారు. 2014 ఆగస్టు 15న విశాఖ పట్టణానికి చెందిన ఉన్నత విద్యావంతురాలు కర్రి పుష్పారెడ్డిని ఆదర్శ వివాహం చేసుకున్నారు. ఆమె ప్రస్తుతం వరంగల్‌ సెంట్రల్‌ జోన్‌ అదనపు డీసీపీగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు ఆశ్రిత్‌, కూతురు ఆద్యా ఉన్నారు. కృష్ణ ఆదిత్య తన ప్రాథమిక, హైస్కూల్‌ విద్యను నల్గొండలో పూర్తి చేశారు. విజయవాడ శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్‌, హైదరాబాద్‌ మాతృశ్రీ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ అభ్యసించారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో వెలువడిన గ్రూప్‌-1 ఫలితాల్లో ఆయన ఏడోర్యాంకు సాధించి డీఎస్పీ పోస్టు పొందారు. హైదరాబాద్‌ ‘అప్పా’లో ఏడాదిపాటు శిక్షణ పూర్తి చేసుకున్నారు. మేనమామ, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నితీ అయోగ్‌ అడిషినల్‌ సెక్రెటరీ కొలనుపాక రాజేశ్వర్‌ రావును స్ఫూర్తిగా తీసుకున్న కృష్ణ ఆదిత్య అమ్మమ్మ కొలనుపాక రుక్మిణి ప్రోత్సాహం, తల్లిదండ్రుల సహకారంతో సివిల్స్‌ రాసి అఖిలభారత స్థాయిలో 99వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌ పొందారు.

ఉద్యోగ ప్రస్థానం..

కృష్ణ ఆదిత్యకు 2014 సెప్టెంబర్‌ 2న నారాయణపేట సబ్‌ కలెక్టర్‌గా తొలి పోస్టింగ్‌ లభించింది. అక్కడ ఏడాదిన్నర పాటు బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత మహబూబ్‌ నగర్‌ ఆర్డీవోగా బదిలీపై వెళ్లి సమర్థవంతంగా పనిచేశారు. 2018లో నాలుగు నెలల పాటు, మహబూబ్‌ నగర్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా సేవలందించారు. 2019 మే 18 నుంచి 2020 ఫిబ్రవరి మొదటి వారం వరకు ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా విధులు నిర్వర్తించారు. అనంతరం 2020 ఫిబ్రవరి 8న ములుగు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2019 ఫిబ్రవరి 17న కొట్లాడి సాధించుకున్న ‘ములుగు’ జిల్లాను ప్రగతి పథంలో నిలిపేందుకు కృష్ణ ఆదిత్య ఆరాట పడుతున్నారు.

మేడారం జాతర విజయవంతం..
కుంభమేళను తలపించే మేడారం మహా జాతరను ప్రజల సహకారంతో విజయవంతం చేశారు. మహా సంకల్పంతో ఈ జాతరను విశ్వవ్యాప్తం చేశారు. దేశ నలుమూలల నుంచి తరలి వచ్చిన సుమారు కోటి మంది భక్తులకు వసతి, భద్రత సౌకర్యాలు కల్పించి శభాష్‌ అనిపించుకున్నారు. 2020 ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరిగిన జాతర అనంతరం పారిశుధ్యం పనులను వారం రోజుల్లోనే పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రశంసలు పొందారు. పాకాల, రామప్ప సరస్సులు, బొగత జలపాతాన్ని పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నారు. ఎకో టూరిజం అభివృద్ధితోపాటు, రామప్ప దేవాలయానికి ‘యునెస్కో’ గుర్తింపు వచ్చేలా కృషి చేశారు. ప్రజల ప్రాణాలకు సంకటంగా మారిన ప్లాస్టిక్‌ నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

హరితహారం..
జిల్లాలో హరితహారం కార్యక్రమంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కల సంరక్షణపై దృష్టి సారించేలా చర్యలు చేపట్టారు. నాటిన మొక్కలను సంరక్షించడం అందరి బాధ్యతని, వాటిని పెంచి భవిష్యత్‌ తరాలకు ఆదర్శంగా నిలవాలని కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య సూచిస్తున్నారు.

పేదల ఆశాజ్యోతి
పేదల ఆశాజ్యోతిగా పేరెన్నికగన్న కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ఆదర్శ అధికారిగా గుర్తింపు పొందారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకంలో 119 మంది దళితులకు యూనిట్లు అందించారు. పార్టీలకు అతీతంగా దళిత బిడ్డల బాగు కోసం పైరవీలు లేకుండా దళిత బంధు పథకం వర్తింపజేస్తున్నారు. వారు స్వయం ఉపాధితో నిలదొక్కుకునేలా చర్యలు చేపట్టారు. గోదావరి నదీజలాల సమర్థ వినియోగం, దేవాదుల ఎత్తిపోతల పథకానికి నీటి లభ్యత పెంచే ఉద్దేశంతో చేపట్టిన తుపాకులగూడెం (సమ్మక్క) బ్యారేజీ పనులను పూర్తి చేయిస్తున్నారు. ముఖ్యంగా విద్యా, వైద్య రంగాల్లో మార్పులు తీసుకొచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రులను అన్ని విధాలా తీర్చిదిద్దిన ఆయన ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో గుర్తించిన పనులను యుద్ధ ప్రాతిపదికన చేయిస్తున్నారు. జిల్లా కేంద్రంలో జాతీయ రహదారిని విస్తరించి, సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఏజెన్సీలో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచిన ఆయన 340 యూనిట్ల ‘మినీ డెయిరీ’ ని సాధించారు. ఫైల్‌ మేనేజ్‌ మెంట్‌ ను పక్కాగా అమలు చేస్తూ.. జిల్లా ప్రధాన కార్యాలయాన్ని ఈ-ఆఫీస్‌గా మార్చారు. ఫైల్‌ ట్రాక్‌ సిస్టమ్‌ ను అమలు చేస్తూనే ప్రభుత్వ కార్యాలయాలను ఆధునీకరించారు. జిల్లా కేంద్రంలో మెడికల్‌ కళాశాలకు కేటాయించిన స్థలం చుట్టూ రూ. 2 కోట్ల 60 లక్షల ఐటీడీఏ నిధులతో ప్రహారి పనులను చేపట్టారు. అలాగే రూ. కోటి 73 లక్షల ఐటీడీఏ నిధులతో రోడ్లు, భవనాలశాఖ ద్వారా నిర్మించిన ప్రభుత్వ అతిథి గృహాన్ని ప్రారంభించారు.
ఉపాధి హామీ పనులు..
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు చేతినిండా పని కల్పించారు. ప్రతీ గ్రామ పంచాయతీలో ఉపాధిహామీ పనులను పూర్తి చేయించి కష్టకాలంలో ఉన్న పేదలను ఆదుకుంటున్నారు.గతంలో ఎన్నడూ లేని విధంగా వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్‌ యార్డులు, క్రీడా మైదానాలు, అవెన్యూ ప్లాంటేషన్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలను పూర్తి చేయించారు. రైతుబంధు పథకాన్ని అన్నదాతలకు అందించారు. రైతులు పండిరచిన వ్యవసాయ పంటలను ప్రభుత్వం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నారు. జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం పెరిగినందున డిమాండుకు తగినట్లు ఎరువులు, క్రిమి సంహారక మందులు అందుబాటులో ఉంచారు. ప్రభుత్వ నిబంధనల మేరకే విత్తనాలు విక్రయించే విధంగా చర్యలు తీసుకున్నారు. నకిలి విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే పీడీయాక్ట్‌ నమోదు చేయిస్తున్నారు.

అమ్మ ఒడితో చేయూత..
ములుగు జిల్లాలో ఉన్న గర్భిణులకు భరోసా కల్పిస్తున్నారు. హై రిస్క్‌ ఉన్నవారిని గుర్తించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకున్నారు. ‘అమ్మఒడి’ పథకం కింద వారికి కేసీఆర్‌ కిట్లు అందజేస్తున్నారు. నిరుపేదలకు అండగా నిలుస్తూ.. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను అందిస్తున్నారు. అర్హులందరికీ పింఛన్లు అందేలా చర్యలు తీసుకున్నారు.

సమిష్టి కృషితో కరోనా కట్టడి…
విశ్వమంతా విలయతాండవం చేస్తున్న కరోనా కట్టడికి కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య నాయకత్వంలో ములుగు జిల్లా యంత్రాంగం నిర్విరామంగా కృషి చేస్తున్నది. వైరస్‌ నియంత్రణ కోసం ఆయన ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులను మెరుగుపరిచారు. వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు, ఔషదాలు సమకూర్చారు. కరోనాతోపాటు వైరల్‌ ఫీవర్లకు ట్రీట్‌మెంట్‌ చేసేలా చర్యలు తీసుకున్నారు. సీజనల్‌ వ్యాధులను సకాలంలో అరికట్టారు. సమష్టి కృషితోనే కరోనా వైరస్‌ను కట్టడి చేశారు. ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు స్వీయ నియంత్రణతోపాటు, భౌతిక దూరం పాటించేలా అవగాహన తీసుకువచ్చారు. కరోనా బారిన పడకుండా మాస్కులు ధరిస్తూనే, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకున్నారు.

వరదముప్పు ప్రాంతాల్లో సహాయక చర్యలు..
గత ఏడాది భారీ వర్షాలు కురిసిన సమయంలో నీటమునిగిన ప్రాంతాల్లో కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య విస్తృతంగా పర్యటించి సహాయక చర్యలు తీసుకున్నారు. ఏజెన్సీ గ్రామాలను సందర్శించి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, పంటలు, డ్రెయినేజీలు, ఇళ్లు, వాగులు, ముంపు ప్రాంతాలను పరిశీలించి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నారు. జలదిగ్బందంలో చిక్కుకున్న వారికి ప్రాణనష్టం జరుగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ముంపునకు గురైన బాధితులు, అనారోగ్య సమస్యలతో బాధ పడే వారిని, గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జిల్లా వ్యాప్తంగా 28 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి బాధితులకు భోజనం, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించారు. అలాగే వేలాది ఎకరాల్లో దెబ్బతిన్న పంటల వివరాలను ప్రభుత్వం దృష్టికి కలెక్టర్‌ తీసుకెళ్లారు. గోదావరి వరదబాధితులు అధైర్యపడకుండా వారిని ఆదుకుంటారనే భరోసా కల్పించారు. ముంపు నివారణకు శాశ్వత పరిష్కారంతోపాటు, బాధితులందరికీ పరిహారం అందేలా కృషి చేస్తున్నారు. ఓవైపు కరోనా విలయతాండవం.. మరో వైపు వరదలు బీభత్సం సృష్టించినప్పటికీ జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య అప్రమత్తం చేసి ప్రజల మన్ననలు పొందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *